7, సెప్టెంబర్ 2026, సోమవారం

రాతి గుట్టపై బసవేశ్వరుడు..

  


బాన్సువాడ మండలం బోర్లం గ్రామ సమీపంలోని రాతి గుట్టపై ప్రకృతి ఒడి మధ్యలో కొలువుదీరిన ఆది బసవేశ్వర ఆలయం నాలుగు శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది .తరతరాలుగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు . ఆలయం లోని బసవేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. శ్రావణమాసం ప్రతి సోమవారం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో భక్తుల రద్దీ పెరుగుతుంది .

స్థల పురాణం ఇదీ ..

ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉన్నది. సుమారు 400 ఏళ్ల క్రితం బిచ్కుంద మఠాధిపతి మడిమాలప్ప స్వామికి బీదర్ ప్రాంతంలో ఓ కోడెదూడను కానుకగా ఇచ్చినట్లు చెబుతారు .దానిని బిచ్కుందకు తీసుకెళ్తుండగా బోర్లం రాతి గుట్ట వైపు వెళ్లినట్లు స్థానికుల కథనం. అక్కడ జొన్న పంటను మేయడంతో కాపర్లు దానిని తరిమారు. గుట్ట సమీపానికి చేరుకున్న కోడె పెద్దగా రంకె వేసి అదృశ్యమైనట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ విషయం మడిమాలప్ప స్వామికి తెలియడంతో స్వామి కలలో కనిపించి గుట్టపై శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించినట్లు భక్తుల విశ్వాసం. దీనితో ఆయన బిచ్కుంద నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి గుట్టపై ప్రతిష్టించి పూజలు ప్రారంభించినట్లు చెబుతారు .ప్రస్తుతం ఆలయం బిచ్కుంద బండాయప్ప మఠం ఆధ్వర్యంలో పీఠాధిపతి సోమాయప్ప పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రతినిత్యం అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ఉండగా శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు, ప్రతి సోమవారం అఘోర పశుపతి హోమం, రుద్రాభిషేకాలు, మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది .

బావినీటికి ప్రత్యేకత..

 ఆలయ గుట్ట కింద ఉన్న బావినీటికి కూడా ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతారు . నీరు పాలవలే తెల్లగా, మధురంగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నది.  బిచ్కుంద బండయప్ప  స్వామి జీవించి ఉన్న సమయంలో శ్రావణ మాసంలో ఇక్కడ ఏటా అన్నదానం నిర్వహించేవారు.  ఓసారి నైవేద్యం కోసం పోలెలు తయారు చేస్తుండగా నెయ్యి తక్కువ కావడంతో ఆయన ఆదేశాల మేరకు శిష్యుడు బావి నుంచి నెయ్యి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. చారిత్రక నేపథ్యం, స్థల పురాణం, ప్రకృతి అందాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ క్షేత్రానికి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది .ఆలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి క్షేత్ర చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం ,పాలకులు అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఆది బసవేశ్వర ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

పెరుగుతున్న బసవేశ్వరుడు 

గత 35 ఏళ్లుగా ఆలయంలో పూజారిగా సేవలందిస్తున్న ఆలయ పూజారి శ్రీధర్ అప్ప గారు ఇలా అంటున్నారు. సాధారణంగా శివాలయాలలో గర్భగుడిలో శివలింగం గర్భగుడి బయట నందీశ్వరుడు ఉంటాడు. కానీ ఆది బసవేశ్వర ఆలయంలో గర్భగుడిలో శివలింగంతోనే నందీశ్వరుడు ఉండడం విశేషం .భక్తులు నమ్మకంతో కొలిచే బసవేశ్వరుడు ప్రతి ఏటా పెరుగుతూ కనిపించడం ఇక్కడే ప్రత్యేకత. 

ఆది బసవేశ్వర ఆలయం మా గ్రామంలో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ప్రతి సోమవారం చిన్ననాటి నుండి బసవేశ్వరుని దర్శించుకుంటాను అని గ్రామస్తులు కేశెట్టి రఘునాథ్ గుప్తా గారు అన్నారు.

ఆధ్యాత్మిక సమాచారం 7-9-2026

 దుర్గా మాత షెడ్డు నిర్మాణానికి భూమి పూజ



నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో దుర్గామాత షెడ్డు నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ మనేద శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు .తన సొంత నిధులైన లక్ష రూపాయల వ్యయంతో శ్రీనివాస్ సంబంధిత షెడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


ఆలయ అభివృద్ధికి మొదటి వేతనం విరాళం 



నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల రుచిత తన మొదటి వేతనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల కోసం విరాళంగా అందించారు. వేతనానికి సంబంధించిన చెక్కును ఆదివారం వేములవాడ ఆలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పెరిక శ్రీనివాస్ కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏఈఓ లక్ష్మణరావు ఆమె తల్లిదండ్రులు జే రవీందర్ ,మీనా తదితరులు పాల్గొన్నారు.


రూ. 50 లక్షల విలువైన భూమి విరాళం.. 



హన్మకొండ జిల్లా ధర్మ సాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ,రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన చింతలపాటి సుధీర్ రెడ్డి, చింతల పాటి సుకన్య దంపతులు రూ 50 లక్షల విలువైన 550 గజాల ఖాళీ స్థలాన్ని విరాళం గా అందచేశారు. తమ ఓపెన్ ప్లాట్ ను గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ కు అప్పగించారు. తమ తండ్రి చింతలపాటి రామచంద్రా రెడ్డి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందచేసినట్లు తెలిపారు. దాతలను గ్రామస్తులు అభినందించారు. 

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన..



బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ , సేవాలాల్ ఆలయంలో ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగదాంబ, సేవాలాల్ ఆలయాల నిర్మాణం తో తండాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తండా వాసులు, భక్తులు పాల్గొన్నారు. 

తెలంగాణ గంగ తెప్పోత్సవం అంటే..



తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనుల పండుగ గా జరిగింది .ఖైరతాబాద్ ఏడు గుడులనుంచి హుస్సేన్ సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతురాజులు, జోగినిల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభా యాత్ర సాగింది. నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని గంగపుత్రులకు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా గంగ తెప్పోత్సవ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు మాట్లాడుతూ గంగ తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు .



హఫీజ్ పేటలో అహింసా స్థూపం..



దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో మియాపూర్ లో "అహింసా స్తూపం " ఆవిష్కృతమైంది. ఆదివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డులో అహింస స్తూపంను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రవికుమార్ యాదవులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. స్థూపం రాబోయే తరాలకు శాంతి ,అహింసల దివ్య సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్తంభంపై లిఖించిన" పరస్పరోపగ్రహో జీవానాం  " అనే సందేశం నేటి అశాంతియుత  ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మనిషి మనిషికి , జీవి జీవికి పరస్పరం సహకరించుకోవాలనే ఈ సందేశం సమాజాన్ని ఐక్యంగా నిలబెడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యానికి జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని, ఇది ప్రపంచానికి ఐక్యత మానవీయ సందేశాన్ని చాటి చెప్పిందని అభినందించారు. అహింస అంటే కేవలం శారీరక హాని చేయకపోవడమే కాదు మాటలలో, ప్రవర్తనలో, ఆలోచనలో కూడా దానిని పాటించడమేనని స్పష్టం చేశారు. నగర ఆర్థిక ,సామాజిక ,సంస్కృతిక ప్రగతిలో జైన్, బ్రాహ్మణ ,మహేశ్వరి వంటి వివిధ సమాజాలు కీలక భూమిక పోషించాయని కొనియాడారు.



చుక్క పూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి విరాళాలు


 

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చింతల శ్రీనివాస్ ,అరుంధతి దంపతులు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీనివాసచార్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.

విరాళం అందజేత..



గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామచంద్రస్వామి ఆలయానికి పోతంగల్ కలాన్ కి చెందిన కిషన్ 25 వేల రూపాయల నగదును ఆదివారం సర్పంచ్ గంగారం, ఆలయ కమిటీ చైర్మన్ బిషన్ నాయక్ లకు అందజేశారు.


ధాన్యోస్మి..



సహజ సిద్ధంగా లభించే బంకమట్టి ,ధాన్యం, పెసర్లు, మినుములు, ఆవాలు వంటి పప్పు దినుసులతో తయారు చేసిన వినాయక విగ్రహం ఇది .బొజ్జ గణపయ్యను పూజించడమే కాదు ,ప్రకృతిని సైతం కాపాడుకోవాలి అనే ముఖ్య సందేశంతో విజయవాడకు చెందిన ఒక వైద్యుడు మట్టి ,చిరుధాన్యాలతో నాలుగడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. మట్టి సులువుగా నీటిలో కలిసిపోతుందని, చిరుధాన్యాలు జీవరాశుల ఆహారంగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ఆలయానికి స్టాండు వితరణ..



కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి మైలారం గ్రామానికి చెందిన బొట్టే కల్పన జ్ఞాపకార్థం బొట్టేమోహన్ ఆలయ కమిటీ సభ్యులకు కొబ్బరికాయలు కొట్టే స్టాండును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, గ్రామస్తులు రమేష్, లింగం గౌడ్, గంగాధర్, కాశీరాం, రాములు , మహేందర్ ,రాజు పాల్గొన్నారు.