17, సెప్టెంబర్ 2026, గురువారం

బ్రహ్మ దేవుడు.. చీమ..

 ప్రచారంలో ఉన్న ఒక పౌరాణిక కథను అనుసరించి ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసుకుంటూ ఆనందంగా విహరిస్తున్నాడు. అప్పుడు ఆయనకు ఒక చీమ కనిపించింది .అది ఎంతో శ్రద్ధగా తన ఆహారాన్ని మోసుకుంటూ వెళుతుంది .ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దాం అని బ్రహ్మదేవుడు ..నీ చిన్ని పొట్ట నిండటానికి ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ పట్టుదలతో పని చేస్తున్నావు అన్నాడు నవ్వుతూ. స్వామి నా ఆయువు కూడా చిన్నదే.  కానీ ఈ చిన్న జీవితంలో నా కర్తవ్యాన్ని పాటించడం ధర్మం కదా అంది .ఆ జవాబు విని సంతోషించిన బ్రహ్మదేవుడు, అవును కర్తవ్య నిర్వహణ చాలా ముఖ్యమైనది .ప్రతి జీవిలోనూ దైవాంశం ఉంది.

 నువ్వు నీ కర్మ ఫలానుసారం ప్రయాణిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నావు అన్నాడు. చీమ తన అల్పశక్తితోనే ఇతర జీవులకు సాయం చేసేది. కర్తవ్యాన్ని ధర్మ నిష్టగా భావించి నిరంతరం శ్రమించే చీమ మనకు ఆదర్శం. నలుసంత ఉన్న చీమే అలా ఉన్నప్పుడు.. విచక్షణ జ్ఞానం ఉన్న మనం ఎంత ఉన్నతంగా జీవించాలో, ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలో తెలియ చేస్తుంది ఈ కథనం. 

ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం..

 మన సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక అద్భుత వైజ్ఞానిక నేపథ్యం ఉంటుంది .ఆలయ ప్రదక్షిణ అనేది కేవలం దైవభక్తికి నిదర్శనం మాత్రమే కాదు, అది మన శరీరాన్ని, మనసును సమతుల్యం చేసే శక్తివంతమైన ప్రక్రియ. ఆలయ నిర్మాణంలో పాటించే శాస్త్రీయ అంశాలే అందుకు కారణం .గర్భాలయంలోని మూల విరాట్ నుంచి వెలువడే అయస్కాంత శక్తి క్షేత్రాలను గ్రహించడానికి ప్రదక్షిణ దోహదం చేస్తుంది. భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే సవ్య దిశ పద్ధతిలో మనం తిరిగినప్పుడు.. ఆ విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాలతో మన శరీరం అనుసంధానం అవుతుంది. ఇది కేవలం నడక కాదు, ప్రకృతి క్రమంతో మనం మమేకమవడం.

 ప్రదక్షిణ చేసేటప్పుడు మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి ఒక రకమైన చలన ధ్యానం స్థితికి చేరుకుంటుంది. నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేస్తూ సాగే ఈ ప్రక్రియ మెదడులోని అనవసరమైన ఆలోచనలను పారద్రోలి ,ఏకాగ్రతను పెంచుతుంది. ఈ స్థితి శారీరకంగా ఎంతో మేలు చేస్తుంది. ప్రదక్షణ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి మనల్ని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తుంది. దైవసాన్నిథ్యంలో అనంత శాంతిని చేకూర్చి మన లో లోపల ఉన్న వ్యధలు ,వేదనలను పోగొడుతుంది. మనలో ఏదైనా వ్యతిరేక ప్రతికూల భావాలు ఉంటే తొలగించి సానుకూలతను నింపుతుంది .ప్రదక్షిణ అంతరార్థం మన అహంకారాన్ని వీడటమే. సృష్టిలో దైవమే కేంద్ర బిందువు అని , మనము ఆ శక్తి చుట్టూ తిరిగే ఒక అణువు మాత్రమే అని గుర్తించినప్పుడు అహంకారం సహజంగానే తగ్గుతుంది. ప్రపంచం మన చుట్టూ తిరగడం లేదని మనం ఆ దైవీక శక్తి పరిధిలో భాగమని గ్రహించడమే నిజమైన వినయం.

 ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చూస్తే భక్తిని చాటుతుంది. తాత్విక కోణంలో వినమ్రతను నేర్పుతుంది .నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ,ప్రతికూల ఆలోచనలను తొలగించుకోవడానికి ఆలయ ప్రదక్షిణ ఒక చక్కని పరిష్కారం .ఇది శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. మనసును శాంతింప చేసే ధ్యానమార్గం. అహంకారాన్ని తుడిచిపెట్టి ఆత్మ శోధన. 

కామాఖ్యా దేవి.. అసోం

 


కామాఖ్య దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా పూజలు అందుకునే శక్తి స్వరూపిణి .యోని రూపంలో దర్శనము ఇచ్చే ఈ అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా నిర్వహించే బాచి మేళా ఎన్నో విశేషాల సమాహారం.



 బ్రహ్మపుత్ర నది తీరాన నీలాచల పర్వతాల నడుమ నాగర నిర్మాణ సైతు అబ్బురపరుస్తుంది కామాఖ్య దేవి మాత ఆలయం అసోం లోని గువాహటిలో ఉండే ఈ ఆలయాన్ని ప్రేమకు అందానికి అధిపతి అయిన మన్మధుడు నిర్మించాడని కథనం. ఆ ఆది పరాశక్తి యోని రూపంలో పూజలు అందుకునే ఈ క్షేత్రంలో ఏటా నాలుగు రోజుల పాటు జరిగే అంబు బాచి మేళా కు సాధారణ భక్తులే కాక , ఎందరో సాధువులూ హాజరవుతారు. అంబుబాచీ మేళా కామాఖ్య దేవి ఆలయంలో ఏడాదికోసారి జూన్ నెలలో జరిగే అతి ముఖ్యమైన వేడుక. అంబు అంటే జలం, బాచీ అంటే పారడం అని అర్థం. సాధారణ మహిళల్లానే ఇక్కడ కొలువైన అమ్మవారికీ నెలసరి వస్తుందని ఓ విశ్వాసం. అందుకే, ఆ సమయంలో తెల్లని వస్త్రాన్ని గర్భ గుడిలోని విగ్రహానికి చుట్టి మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తారు. నాలుగో రోజు ఆలయాన్ని తెరిస్తే .. ఆ వస్త్రం నెత్తురుతో తడిసి ముద్దై పోయి ఉంటుందట. తర్వాత పూజారులు ఆలయాన్ని శుభ్ర పరిచి , అమ్మవారికి పూజలు నిర్వహించి , అప్పుడు దర్శనానికి అనుమతిస్తారు. ఇంకా ఆ వస్త్రాన్ని చిన్న ముక్కలుగా చేసి భక్తులకు పంచి పెడతారు. నాలుగవ రోజు దేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలూ కలుగుతాయనే నమ్మకం తోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై నుంచి 30 లక్షల మంది భక్తులు ఈ మేళాలో పాల్గొంటారు. అంబు బాచి మేళా సమయంలో బ్రహ్మ పుత్ర నది కూడా ఎరుపు రంగు లోకి మారుతుందని చెబుతారు అర్చకులు. ఇక స్థానికులూ ఆ నాలుగు రోజులూ ఎంతో నియమ నిష్ఠలతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆ మూడు రోజుల పాటు తమ ఇళ్లలోనూ నిత్య పూజలు ఆపేస్తారు. రైతులు సైతం భూమిని దున్నే పనులను నిలిపి వేస్తారు. నాలుగో రోజు తమ ఇళ్లను శుభ్ర పరిచి ఆ తర్వాత వంటలు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇది కాకుండా జగన్మాతకు నవ రాత్రులు , దీపావళి, సంక్రాంతి, శివ రాత్రి సమయాలలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. మానస పూజ, కన్యా పూజలనూ చూసి తీరవలసిందే. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు కొలువుదీరడం వెనుక ఆసక్తి కరమైన కథనం ఉంది. 

స్థల పురాణం ప్రకారం..

ఒకసారి దక్ష ప్రజాపతి ఓ యాగాన్ని తలపెట్టి ,కుమార్తె అయిన సతీదేవిని ,అల్లుడైన శివుడిని ఆహ్వానించలేదట. అయినా కూడా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి ,తనను తండ్రి అవమాన పరచడంతో అగ్నికి ఆహుతి అవుతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రళయ తాండవం చేయడం ఆరంభిస్తాడు. దాంతో ముల్లోకాలూ కంపించి , దేవతలంతా శ్రీహరిని శరణు వేడతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించి , దేవి శరీరాన్ని ఖండించడంలో ఆ భాగాలు పలు చోట్ల పడి , శక్తి పీఠాలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిల్లో అమ్మ వారి యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. కాళికా పురాణం ప్రకారం.. ఓసారి మన్మధుడు శివుడి శాపానికి గురవడంతో రతీ దేవి విలపించింది. అది చూసి స్వామి శాపాన్ని ఉపసంహరించుకున్నా మన్మథుడికి పూర్వ సౌందర్యాన్ని ప్రసాదించలేదట. దాంతో రతీ మన్మధులిద్దరూ పరమేశ్వరుడిని అనుగ్రహించమని ప్రార్థించడంతో ఈ ప్రాంతానికి చేరుకుని అమ్మవారిని పూజించమని ఆదేశించాడట. అలా మన్మధుడు ఇక్కడకు వచ్చి, జగన్మాతను పూజించి , పూర్వ వైభవం పొంది , దేవి కోసం ఆలయాన్ని నిర్మించాడనేది కథ. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన బిశ్వసింగ అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకుంటే క్రమంగా ఆయన కుమారుడు నర నారాయణ్ పూర్తి చేశాడట. 

ఇతర దేవతలనీ..

ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే కామాఖ్యా దేవి ఆలయంలోని దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా, క్షణాల తేడాలోనే తన రూపాలను మార్చుకుని భక్తుల్ని అనుగ్రహించే కామ రూపిణిగాను పూజలు అందుకుంటోంది.దశమహా విద్యలకు అధిపతులైన త్రిపుర సుందరి ,మాతంగి,కమలాత్మిక, కాళి, తార,భువనేశ్వరి,భగలాముఖి , చిన్న మస్త, భైరవి, ధూమవతి దేవతలకూ ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా పరమేశ్వరుడు కామేశ్వర, సిద్ధేశ్వర, అమరతోకేశ్వర, కోటి లింగేశ్వర , అఘోర.. వంటి ఐదు రూపాల్లోనూ పూజలు అందుకుంటున్నాడు. 

ఇలా చేరుకోవచ్చు..

కామాఖ్య దేవి ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైళ్లలో రావాలనుకునే భక్తులు కామాఖ్య జంక్షన్ లో దిగితే ఆలయం ఇంచుమించు 20 నిమిషాల దూరంలో ఉంటుంది.



ఆధ్యాత్మిక విశేషాలు 17-9-26

 మల్లన్న హుండీ ఆదాయం 74 లక్షల రూపాయలు 

ప్రముఖ పుణ్య క్షేత్రం కొముర వెల్లి మల్లిఖార్జున స్వామి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది.లెక్కింపును ఆలయ ముఖ మండపం వద్ద చేపట్టారు.లెక్కింపులో శ్రీ శివ రామ కృష్ణ భజన మండలి సేవా సభ్యులు పాల్గొన్నారు.63 రోజులకు గాను 74 లక్షల 52 వేల 87 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 32 గ్రాములు , మిశ్రమ వెండి 3 కిలోల 200 గ్రాములు విదేశీ కరెన్సీ 31 నోట్లు హుండీల ద్వారా లభించినట్లు ఆలయ ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున ,స్థానాచార్యులు పీ మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు..



భిక్కనూరు మండల కేంద్రంలో సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కించారు ఈఓ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రక్రియ చేపట్టారు.3,57,298 రూ.లు వచ్చినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి,ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి,పూజారులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు . 

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుంకరి అశోక్ కళ్యాణి దంపతులు పూజలు నిర్వహించి 10,102 రూ.విరాళం అందజేశారు.

15, సెప్టెంబర్ 2026, మంగళవారం

శ్రీనివాస గిరి.. పాల్వంచ

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శ్రీనివాస కాలనీలోని శ్రీనివాస గిరి. పచ్చని కొండపై 600 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి , భూదేవి సమేతంగా స్వయంభువుగా వెలిశారు. గుహలో కొలువైన స్వామిని 2 వేల మెట్లు ఎక్కి దర్శించుకోవాలి ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుహలో తొలుత మట్టి నిండుకొని నీటి చుక్కలు పడుతూ ఉండేవి. ఓ సారి అడవికి వెళ్లిన వారు దాహార్తి తీర్చుకునేందుకు గుహ వైపు వెళ్లగా అక్కడ నీటి చుక్కలకు రాతి పై ఉన్న మట్టి కరిగి స్వామి వారి రూపం పాక్షికంగా కనిపించింది. కొంత మంది కలిసి గుహలో మట్టినంతా శుభ్రం చేశారు. అప్పటి నుంచి స్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. 

ప్రతి శని వారం విశేష పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న వెంకటేశ్వరుడిగా భాసిల్లుతున్న స్వామి వారి కళ్యాణ వేడుకకు ఏటా తెలంగాణ,ఏపీ ల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు.కళ్యాణానికి పాల్వంచ తహసీల్దార్ ముత్యాల తలంబ్రాలు తీసుకు రావటం అనవాయితీ. మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి, అనంత పద్మనాభ స్వామి,దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి.






శ్రీకూర్మం పుణ్య క్షేత్రం..

 దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నంలో మందర పర్వతాన్ని కవ్వంగానూ , నాగ దేవత వాసుకిని కవ్వపు తాడుగానూ చేసుకున్నారు. ఓ శుభ ముహూర్తంలో సముద్ర మధనాన్ని ఆరంభించారు. కవ్వపు తాడును ఒక వైపు దేవతలు, మరో వైపు రాక్షసులు పట్టుకున్నారు. అలా చిలుతుంటే .. మందర పర్వతం సముద్రంలోకి జారి పోతుంది. దాంతో భయపడిన దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తాబేలు రూపం ధరించాడు. 

కూర్మ రూపంలో మందర గిరిని పైకెత్తి , తన వీపు మీద మోసి సముద్ర మధనానికి ఆటంకం కలగకుండా రక్షించాడు స్వామి. అప్పటి నుంచి ఆ లక్ష్మీ నాథుడు కూర్మ రూపంలోనూ పూజలందుకుంటున్నాడు.కూర్మావతారం భక్తుల పాలిట అభయావతారం . కంచెర్ల గోపన్న దాశరథీ శతకం లో విష్ణు భగవానుడు దాల్చిన కూర్మ రూపానికి అక్షరాంజలి ఘటిస్తూ  కూర్మమై దరాధరము భరించితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ .. అని స్మరించుకున్నాడు. అలాగే నరసింహ శతకంలో శేషప్ప కవి , గీత గోవిందంలో భక్త జయదేవుడు తదితరులు కూడా లక్ష్మీ నాథుడి కూర్మ లీలా విన్యాసాలను మనోహరంగా మననం చేసుకున్నారు. 

ఆలయాల్లో ఆరాధనలు..

శ్రీ మహా విష్ణువును కూర్మావతారంలో ఆరాధించే ఆచారం ఉంది ,కాబట్టి ఆ రూపంలోనూ ఆలయాలున్నాయి.శ్రీకాకుళానికి 40 మైళ్ళ దూరంలో వంశధార తీరాన ఉన్న శాలి హుండం కొండకు ' కూర్మాద్రి ' అనే పేరు కూడా ఉంది ఆ జిల్లాలోనే శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం వెలసింది అక్కడి ఆలయంలో స్వామి కూర్మ నాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయంలో కూర్మ నాధుడు స్వయంభువుగా వెలయడం విశేషం. స్థల పురాణం అనుసరించి చంద్రవంశ మహా రాజైన శ్వేత చక్రవర్తికి ఆ శేష శయనుడు కూర్మ నాధుడిగా ప్రత్యక్ష మయ్యాడు.అలాగే శ్రీకూర్మం లో వెలసిన కూర్మ నాధుడిని కుశ లవులు, బల రాముడు దర్శించుకున్నట్లుగా కథలు ప్రచారంలో ఉన్నాయి.

బోధి సత్వుడే.. బుద్ధుడై..

 బౌద్ధంలో ఒక క్రమ సాధన ఉంది. దాని ప్రకారం ఏళ్ల తరబడి ధ్యానం చేసిన వ్యక్తి బోధి సత్వుడవుతాడు. బోధి సత్వుడు పది దశలు దాటిన తర్వాత బుద్ధుడవుతాడు. మొదటి దశ ముదిత లో లోకంలో అందరికీ మంచి జరగాలనే సమ భావన కలుగుతుంది. రెండోది విమలత్వం . మూడో దశ లో మేధ తేజోవంతం అవుతుంది. నాలుగో దశలో ఆలోచనలు జ్ఞానోదయం వైపు వేగంగా సాగుతాయి. అజేయుడిగా మార్చేది ఐదో దశ. ఆరో దశలో విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకుంటాడు. ఏడో దశలో సంపూర్ణ జ్ఞాన వంతుడవుతాడు. ఎనిమిదో దశలో స్థిర చిత్తుడై అచలత్వాన్ని పొందుతాడు. స్థితప్రజ్ఞత కలుగుతుంది. అంటే లౌకిక విషయాలేవీ సాధకుని ప్రభావితం చేయలేవు. తొమ్మిదో దశలో సాధుమూర్తిగా అవతరిస్తాడు. ఎటు చూసినా కరుణ సాక్షాత్కరిస్తుంది. చివరి దశలో ధర్మ స్వరూపుడై బుద్ధుడిగా వెలుగొందుతాడు. 

సృష్టి మొదలై అంతమవడాన్ని ఒక కల్పం అంటారు. అటువంటి కల్పాలు ఇప్పటి కి పది పూర్తయ్యాయి.. ప్రతి కల్పంలో కొంతమంది బుద్ధులు అవతరించారు.  మనం ఇప్పుడు 11వది అయిన భద్ర కల్పంలో ఉన్నాము. ఈ కల్పంలో వైశాఖ పౌర్ణమి రోజున పుట్టిన 28 వ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు. ఇతడు 35 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందాడు. ఈ గౌతమ బుద్ధుడు లోకంలో దుఃఖము ఉందని ,ఆ దుఃఖానికి కారణము, దాన్నుంచి విముక్తికి మార్గము ఉన్నాయని తెలుసుకున్నాడు. అదే అష్టాంగ మార్గమని చెబుతూ నాలుగు పరమ సత్యాలను ప్రబోధించాడు. దుఃఖానికి కారణం కనుక్కుని దాన్ని ప్రజలకు తెలియజేయడం వల్ల ఈ గౌతమ బుద్ధుడు ఇతరుల కంటే విఖ్యాతుడు అయ్యాడు. కాకతాళీయంగా గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజునే మహాపరి నిర్మాణం పొందాడు. అందుకే వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి గా ప్రసిద్ధి పొందింది. 

14, సెప్టెంబర్ 2026, సోమవారం

ముంబై గణేశుడికి 703 కోట్ల బీమా

 


ముంబైలోని కింగ్స్ సర్కిల్ లో జీ ఎస్ బీ ( గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం , 335 కిలోల వెండి , రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ. 703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శని వారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్నారు. జీ ఎస్ బీ వినాయక చవితి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా నిలుస్తున్నాయి . కేవలం ఆభరణాలే కాకుండా .. నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నవరాత్రులు ఇక్కడ వేద సాంప్రదాయాలు , ఆచారాలు , భజనలు , కీర్తనలతో పాటు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. 

పుచ్చకాయపై గణేశుడు..

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితి సందర్భంగా ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు ,4 అంగుళాల పొడవు గల వినాయకుడి రూపం చెక్కారు.గతంలో చింత గింజలపై వినాయకుడు ,బియ్యపు గింజపై వినాయకుడి చిత్రం వేశారు.ఇలా ఎన్నో సూక్ష్మ కళా రూపాలు తయారు చేసి జాతీయ అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకోవడం జరిగింది.

డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్.. తిరుమల

 


క్యూలైన్లలో వైకుంఠ వైభవం.. భక్తులకు డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్.. 



తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృధా పోనీయకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు టీటీడీ వినూత్న అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ తదితర ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానంతో వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ వన్ లో నాలుగు కోట్ల రూపాయలతో డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్/ హీలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. 

తిరుమలేశుడి ఆలయ ప్రాకారాలు మిలమిల..



తిరుమలేశుడి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులను పుణె కు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రెలీజియస్ ట్రస్ట్ ముందుకొచ్చి చేయిస్తోంది. మొదటి దశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల్లోని పై కప్పులు , స్తంభాలకు సంబంధించిన పనులను నిపుణులైన కార్మికులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మైసూరు పురావస్తు శాఖ విశ్రాంత కెమిస్ట్ అంబేద్కర్ పర్యవేక్షణలో ఈ పనులు చేస్తున్నారు. 

టీటీడీ కి కోటి రూపాయల విరాళం..

టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బెంగళూరుకు చెందిన గిరియప్ప దయానంద రూ. 50 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు కు 50 లక్షలు విరాళంగా అందించారు. 


శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం..

తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే నిమిత్తం టీటీడీ కి రిలయన్స్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది.రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మ రథం బస్సుల్లో తొలి విడత కింద 15 ఈ బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి.మిగిలిన 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ తెలిపింది.


13, సెప్టెంబర్ 2026, ఆదివారం

పంచముఖ సంకట హర మహా గణపతి, ఖైరతాబాద్

 





ఖైరతాబాద్ లో దాదాపు 70 అడుగుల ఎత్తులో కొలువుతీరిన పంచముఖ సంకటహర మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. శనివారం సాయంత్రం విగ్రహ ప్రధాన శిల్పి రాజేంద్రన్ భక్తుల కోలాహలం మధ్య వినాయకుడు విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు . ఏటా ఉత్సవాలకు 45 రోజులు ముందుగానే విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏటా చవితికి రెండు రోజులు ముందు స్వామి  వారి కంటికి తుది మెరుగులు దిద్దడం ఆనవాయితీగా వస్తోంది. 




జూన్ 25న తొలి పూజలు చేయగా, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. విగ్రహం పూర్తి చేసేందుకు ఏటా దాదాపు మూడు నెలల వ్యవధి తీసుకుంటారు .ఈ ఏడాది రెండున్నర నెలలోనే విగ్రహం సిద్ధం చేశారు. 





అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో 17 ఏళ్లుగా గణేష్ మండపం..

 వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో ముంబైలోని కమాటిపుర ప్రాంతంలో గల పీపీ మార్గచా రాజా గణేష్ మండల్ కు 63 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మండల్ కు గత 17 ఏళ్లుగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్బాస్ ఖాన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం విశేషం. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ భారతీయులలా ఒక్కటై ఈ పండుగను వేడుకగా జరుపుకోవడం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు వాలంటీర్ వికాస్ బేలదార్ తెలిపారు. గణపతి అప్పపై నాకున్న అపారమైన విశ్వాసంతోనే ఏటా ఈ వేడుకను నిర్వహించగలుగుతున్నాము. ఇవి రెండు మతాల సామరస్య సందేశం మాత్రమే కాదు, నిజానికి మేమంతా ప్రేమ సందేశం చాటుతున్నాము. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆహ్వానిస్తాం అని అబ్బాస్ ఖాన్ తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే పది రోజులు తాము శాకాహారం భుజిస్తూ, సీర /రవ్వ కేసరి, చనా/ శనగలు ప్రసాదాన్ని ఇంటివద్ద సిద్ధం చేసి మండపానికి తీసుకొస్తామని అబ్బాస్ భార్య హసీనా ఖాన్ చెప్పారు. 



జెండా బాలాజీ జాతర.. నిజామాబాద్..

 కలియుగ దైవమైన గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా భక్తవత్సలా గోవిందా వడ్డీకాసులవాడా గోవిందా అంటూ భక్తులు శ్రీమన్నారాయణ స్వామిని వేడుకుంటూ దర్శించుకున్న అంతనే అండగా నిలిచే స్వామి జండా బాలాజీ వెంకటేశ్వర స్వామి. జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు సెప్టెంబర్ 12వ తేదీన శనివారం ప్రారంభమై 26వ తేదీ శనివారంతో ముగియనున్నాయి.



 మహారాష్ట్రయులు ఎంతో భక్తిగా పిలుచుకొని బాలాజీ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు . ప్రతి ఏటా భాద్రపద మాసంలో ప్రారంభమైన ఉత్సవాలు పౌర్ణమి వరకు సాగుతాయి. మొదటి రోజున వంశపారంపర్య అర్చకులు అజయ్ సాంగువాయి ఇంటి వద్ద పూజలు నిర్వహిస్తారు. నగరంలో వివిధ వీధుల్లో తిరిగి జెండా అర్ధరాత్రి స్థానిక జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయానికి చేరుకుంది. ఆలయంలో ప్రతిష్టించిన జెండాకు పది రోజుల పాటు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని భక్తులు జెండాను దర్శించుకున్నంతలోనే శ్రీనివాసుని సంపూర్ణ కటాక్షాలతో మన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకము. భక్తులకు అభయహస్తాన్ని అందించిన జెండా బాలాజీ శ్రీనివాసుని దర్శించుకోవడానికి జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులకు ఇలవేల్పుగా నిలిచారు. అధిక సంఖ్యలో ఊరేగింపులో భక్తులు పాల్గొననున్నారు .ఆలయ అర్చకులు వేద పండితులచే స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు జెండా బాలాజీ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కందర్ గ్రామంలో సాంగు వాయి వంశస్థులు జెండా బాలాజీని కొలిచేవారు .ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంకటేశ్వర్లు దర్శించుకునే వాడు ఒకసారి స్వామీజీ కలలో కనిపించే నా భక్తులకు ఉత్సవ విగ్రహాలు ఇచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించాడట .హౌసా విగ్రహాలను తీసుకొని ఇంటి దారి పట్టి వారం రోజులు అనంతరం నిజామాబాదులో రాత్రి విశ్రాంతికై నిలిచాడు .రాత్రి స్వామివారు స్వప్నంలో కనిపించి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించమని చెప్పారని తెలుస్తోంది .అలా సాంగ్వాయి వంశం వారు జెండా బాలాజీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జెండా బాలాజీ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శివరాత్రి ఆంజనేయులు కోరారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జండా ఊరేగింపు ఉంటుందన్నారు. స్వామివారి జెండా ముందుండగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పులాంగ్ బ్రిడ్జి వరకు తరలి వెళ్లి విశ్రాంతి విడిది చేయడంతో ఉత్సవ కార్యక్రమాలు ముగిస్తారు అని తెలిపారు. భక్తులు జండా ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అజయ్ సాంగువాయి కుటుంబ సభ్యులు జాలీగాసి గోపాల్ ,లవంగ ప్రమోద్ ,ఆలయ అర్చకులు నాగరాజు ,జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ ,మోర సాయిలు, నర్సింగరావు ,ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 

800 ఏళ్ల బాల గణేశుడు@ఆదిలాబాద్.

 


ఆదిలాబాద్ జిల్లాలో 800 ఏళ్ల నాటి పురాతన బాల గణేశుడి విగ్రహం లభ్యమైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో గల చందా, శివారం గ్రామాల మధ్య సా. శ. 2 వ శతాబ్దికి చెందిన బాల గణేష్ విగ్రహాన్ని , స్థానిక చరిత్ర ఉపాధ్యాయులు పృథ్వీరాజ్ రోడ్డావార్ గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హర గోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి గారు తెలిపారు. చందా గ్రామ శివారులోని రైలు కట్ట సమీపంలోని ఒక చెట్టు కింద గల ఒక శిల్పంలో ఒక పీఠంపై సుఖాసనంలో కూర్చున్న పార్వతి , కుడి చేతిలో ఒక ఫలాన్ని , ఎడమ చేతితో తన ఎడమ తొడపై, కూర్చొని చనుబాలు తాగుతున్న బాల గణేశుని పట్టుకొని ఉందని ,ఆయనకు తలపై కిరీటం లేకపోవడం.. ఈ శిల్పం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వెలుగు చూసిన తొలి, అరుదైన చారిత్రక ప్రాధాన్యత గల శిల్పమని వారన్నారు. బాల గణేశునికి రెండు చేతులే ఉండి, తలపై కిరీటం లేకపోవడం గమనించాల్సిన విషయం అన్నారు. ఆదిలాబాద్ కు 14 కి. మీ దూరంలో సా. శ. 1104 లో మాల్వా దేశ రాజ కుమారుడైన పారమార జగదేవుడు జైనథ్ లో నిర్మించిన లక్ష్మీ నరసింహ ఆలయ శిల్పాలను పోలిన ఈ బాల గణేష్ శిల్పం సా. శ. 12 వ శతాబ్దికి చెందినదని , చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిల్పాన్ని గ్రామ పంచాయతీ కి తరలించి భద్రపరచాలని హరగోపాల్, శివ నాగిరెడ్డి గార్లు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. 



11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం..

 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ప్రవాహం కొనసాగుతున్నది . తాజాగా శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డ్ స్థాయికి చేరింది. గురువారం ఒక్క రోజు హుండీ ద్వారా 6 కోట్ల 93 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు .ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక ఒక్కరోజు ఆదాయాలలో ఒకటిగా నిలిచింది .



తిరుమల చరిత్రలో ఇప్పటివరకు హుండీ ఆదాయం 6 కోట్ల రూపాయల మార్పును దాటడం కేవలం నాలుగు సార్లు మాత్రమే జరగడం విశేషం. 

మరుగోళ్ళ పోటీలు అంటే..

 పోలాల అమావాస్య అంటే.. 

శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం.. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను "పోలాల అమావాస్య" అంటారు.దీనిని కౌశి అమావాస్య , ఆలోక అమావాస్య గా కూడా పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి.ప్రధానంగా ఇది శక్తి పూజ .ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పోలాంబకు ప్రతీకగా కంద మొక్కను పూజా మండపం మీద ప్రతిష్టించి పూజిస్తారు. వరి దుబ్బును కూడా పూజించే ఆనవాయితీ ఉంది. తోరాలను కట్టి ,వాటిని అమ్మవారికి అర్పించి , తమ చేతులకు ,ఇంట్లోని ఆడపిల్లల చేతులకు కట్టుకుంటారు. పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, సిరి సంపదలు ,సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి పలు ప్రాంతాలలో రైతులు తమకు సాగులో సాయం చేసే బసవన్నలకు వృషభ పూజను నిర్వహిస్తారు. దీనిని " ఎడ్ల పొలాల అమావాస్య " అని కూడా అంటారు.



ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పోలాల పండుగ సంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగు రంగుల దుస్తులతో, బెలూన్లతో అలంకరించారు.అనంతరం వీధులలో ఊరేగించారు. గ్రామ దేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 



తర్వాత ఎడ్లను పూజించి నైవేద్యం సమర్పించారు.వాటికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం వీడడం ఇక్కడి రైతుల సంప్రదాయం.



సీతాదేవి ఆలయం, నువారా ఎలియా జిల్లా,శ్రీలంక.

మరుగోళ్ళ పోటీలు..అంటే..

ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి.వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలాల అమావాస్య రోజున సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాంగణంలో మరుగోళ్ళ పోటీలు ప్రారంభం అయ్యాయి.ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల ఆచారాలు ,పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.వీటి పరిరక్షణకు ఐటిడిఏ విశేష కృషి చేస్తోంది.


10, సెప్టెంబర్ 2026, గురువారం

తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి బీమా

 సహజ మరణాలకు రెండు లక్షల రూపాయలు ప్రమాదం అయితే పది లక్షలు టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు ప్రకటన 

తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి బీమా సదుపాయం కల్పించనున్నట్లు టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచి భక్తులందరికీ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు .తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. కొండపై సహజ మరణం పొందిన భక్తుడు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు .ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిధిలో టిటిడి ప్రవేశపెడుతోంది అని  పేర్కొన్నారు. ప్రమాదాలలో మరణించిన భక్తులకు మూడు లక్షలు గా ఉన్న భీమాను 10 లక్షల రూపాయలకు పెంచామని దీనికి 17 లక్షల రూపాయల ప్రీమియం ఖర్చును టీటీడీ భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఐసి తో ఒప్పందం చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.

ఆధ్యాత్మిక సమాచారం 10-9-2026

 మల్లికార్జున హుండీ లెక్కింపు ..

బీరంగూడ గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 200 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు .హుండీ ద్వారా మొత్తం 13 లక్షల  రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు .సంగారెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఆలయ ఈవో దేవనాథం, చైర్మన్ సుధాకర్ యాదవ్ పర్యవేక్షణలో భక్తుల సహకారంతో లెక్కింపు నిర్వహించారు .ఈ సందర్భంగా ఈవో దేవనాదం మాట్లాడుతూ హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సహకారం ఎంతో అవసరమని అన్నారు .అనంతరం చైర్మన్ మాట్లాడుతూ హుంలెక్కింపుకు సహకరించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జు,న్ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, అధికారులు, మహిళా భక్తులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


నడకదారి భక్తులకు రక్షణగా పైకప్పు.. యాదగిరిగుట్ట మెట్ల మార్గంలో నిర్మాణానికి భూమి పూజ.. 




సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించే పైకప్పు నిర్మాణ పనులకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మెట్ల మార్గంలో సందర్శించే భక్తుల సౌకర్యం కోసం బుధవారం ఈ మేరకు శంకుస్థాపన చేశారు .పెన్సిల్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చరల్ విధానంలో ఆధునిక సాంకేతికతతో ఈ పైకప్పును ఏర్పాటు చేయనున్నారు .28 వేల చదరపు అడుగుల ఈ నిర్మాణానికి ఒకటిన్నర కోట్లను హైదరాబాద్లోని మేస్సర్స్ అగర్వాల్ ఫౌండరీస్ చెందిన ప్రమోదగర్వాల్ విరాళంగా అందించనున్నారు .మెట్ల మార్గంలో రక్షణ కోసం సీసీ కెమెరాలు, లైటింగ్ తదితర ఏర్పాట్లకు మరో 25 లక్షల కూడా విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ పైకప్పు నిర్మాణ పనులకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కే మాధవాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి జై భవాని శంకర్ ,అగర్వాల్ ఫౌండరీస్ వైస్ చైర్మన్ సుజయ్ పాల్గొన్నారు. 

9, సెప్టెంబర్ 2026, బుధవారం

భంగారం బిడాయి అంటే..

 



ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి ,భక్తుల ప్రార్థనలు, డప్పుల మోతతో ,పట్టణ సరిహద్దులు దాటిన తర్వాత పూజా సామాగ్రిని అక్కడే వదిలివేయడం.. చత్తీస్గఢ్లోని నారాయణపూర్ లో ఇది ఎన్నో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం .దీనిని భంగారం బిడాయి అంటారు .ప్రజల అనారోగ్యాలు, దుఃఖాలను, బాధలు, కష్టాలను భంగారం దేవుడు తన వెంట తీసుకువెళ్లి, ఆ ప్రాంతానికి శాంతి ,సౌభాగ్యం ,మంచి పంటలను ప్రసాదిస్తాడని స్థానికులు విశ్వాసంతో ఈ వేడుకను నిర్వహిస్తారు .రక్షాబంధన్ తర్వాత శ్రావణమాసం చివరలో, భాద్రపద మాసం ప్రారంభ సమయంలో ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు.  స్థానిక మాత మావిలీ ఆలయంలో పవిత్ర దారం కట్టడంతో ఈ సంప్రదాయం ప్రారంభమవుతుంది. వేడుకలలో భక్తులు పసుపు, నూనెలతో  పాటు తమ మొక్కులు ,కానుకలు దేవుడికి సమర్పిస్తారు .వాటన్నింటినీ సేకరించి ఆలయ ప్రాంగణంలోని ఒక రాయి కింద భద్రపరుస్తారు .పూజల అనంతరం బయటకు తీసి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పల్లకిలో ఉంచుతారు ."సారా " అని పిలిచే పూజారులు ఆ పల్లకిని డప్పుల మోతమధ్య తీసుకెళ్లి, ఊరి చివర పొలిమేరలో విడిచిపెడతామని దేవ్ కమిటీ ఉపాధ్యక్షుడు అర్జున్ దేవాంగన్ తెలిపారు. 

వక్కలతో.. వినాయకుడు

 


వినాయక చవితి పండుగ ఇంకా రాకమునుపే రకరకాల గణపయ్య ప్రతిమలు భక్తులను ఎంతో అలరిస్తున్నాయి. తిరుపతి నుండి కరకంబాడి కి వెళ్లే మార్గంలోని బొమ్మల  క్వార్టర్స్ వద్ద 46 కిలోల, సుమారు 1,80,000  వక్కలతో ఏడడుగుల పర్యావరణహిత విగ్రహం ముస్తాబయింది. దీనిని కళాకారుడు రాము కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధం చేశారు. నిమజ్జనం చేసే సమయంలో పర్యావరణం కలుషితం కావద్దనే ఉద్దేశంతో తిరుపతికి చెందిన పలువురు భక్తులు ప్రత్యేకంగా తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు .ఇందుకోసం కడప నుంచి వెడల్పు ఎక్కువగా ఉన్న వక్కలు తెప్పించామని చెప్పారు. విగ్రహం తయారీకి 15 రోజులు పట్టిందని , ఒక లక్ష పదివేల రూపాయల ఖర్చు అయిందని రాము వివరించారు .


వారం వర్జ్యం 9-9-2026

 త్రయోదశి ..

బుధవారం, సూర్యోదయం.. 6.07 నిమిషాలు, సూర్యాస్తమయం.. 6 20 నిమిషాలు,

 శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం ,వర్ష రుతువు,

 శ్రావణమాసం, కృష్ణపక్షం, త్రయోదశి ..పగలు 11 59 నిమిషాలు,

 తదుపరి చతుర్దశి.. ఆశ్లేష.. పగలు .మూడు గంటల 48 నిమిషాలు ,వర్జ్యం లేదు, రాహుకాలం ..పగలు 12 నుండి 1:30 వరకు ,

యమగండకాలం ..ఉదయం ఏడు గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు,

 దుర్మూర్తం ..పగలు 11:49 నుండి 12. 37 వరకు

7, సెప్టెంబర్ 2026, సోమవారం

వనితలకు రూ 5 కే ఆటో

 తిరుపతి జిల్లా తిరుచానూరుకు చెందిన యువకుడు అజిత్ కుమార్ . ఇంటర్ వరకు చదివి ఆటో నడుపుతున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారు వెలసిన ప్రాంతంలో ఉంటున్నందున అమ్మవారి దర్శనార్థం వచ్చే మహిళలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ,రైల్వే స్టేషన్ వరకు ప్రయాణానికి ఐదు రూపాయల చొప్పున మాత్రమే తీసుకుంటున్నారు .

ఇతర ఆటోవాలా లు 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తారని బస్సు చార్జీ 20 రూపాయలు ఉంటుందని అజిత్ తెలిపారు. నాలుగు నెలల క్రితం ఆటో నడపడం ప్రారంభించామని ,అప్పటి నుంచి ఇదే నిర్ణయానికి కట్టుబడ్డానని అజిత్ వివరించారు. తమిళనాడు సీఎం విజయ్ అభిమానిని అని అందుకే ఆటోకు ఆయన చిత్రాలు వేసుకున్నట్లు పేర్కొన్నారు. 



ఆధ్యాత్మికవేత్త తత్వానంద స్వామి నిర్యాణం

 


ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ,శివ తత్వాన్ని బోధించిన తత్వానంద స్వామి/ వేలేటి రామచంద్ర రావు గారు ఆదివారం శివ సాయుజ్యం పొందారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి మల్లాయ పల్లికి చెందిన వేలేటి రామచంద్రారావు ప్రారంభంలో మల్లాయపల్లిలో బుక్ బైండింగ్ ,ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్ గా, చిన్న మల్లారెడ్డిపేటలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. జ్యోతిష్య శాస్త్రం రంగంలోనూ రామచంద్ర రావుకు విశేష గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక పరిణామాలను ఆయన ముందుగానే అంచనా వేశారని సన్నిహితులు చెబుతుంటారు .పలు పత్రికలలో పాత్రికేయుడుగా పని చేసిన ఆయన కొంతకాలం సినీ రంగంలోనూ పనిచేశారు. వివిధ రంగాలలో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఆయన వాన ప్రస్తాశ్రమ దీక్ష స్వీకరించారు. బసవ కళ్యాణ ఆశ్రమానికి చెందిన స్వామి మధనానందా స్వామి వద్ద ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందిన ఆయన తత్వానంద స్వామిగా దీక్ష స్వీకరించారు. భౌతిక అనుభవాలను ఆధ్యాత్మిక చింతనతో మేళవిస్తూ ప్రజలకు అద్భుతమైన సందేశాలు అందించారు. తెలుగు భాషలో సందేశ తరంగిణి ,భారత యువజనులారా, జగము తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. హైదరాబాదులోని హన్మోజీ గూడలో గాయత్రీ మాత ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ,ధార్మిక కార్యక్రమాలు ,గాయత్రి ఉపాసన ప్రచారంలో చురుగ్గా పాల్గొని అనేకమంది శిష్యులను సంపాదించుకున్నారు. జీవితపు తొలినాళ్లలో మనుషుల జాతకాలను పరిశీలించిన ఆయన మలిదశలో మనిషి అంతరంగాన్ని తట్టి లేపే తత్వవేత్తగా మారారు. ఆయన పార్థివ దేహానికి ఆదివారం హన్మోజీ గూడలోని అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

రాతి గుట్టపై బసవేశ్వరుడు..

  


బాన్సువాడ మండలం బోర్లం గ్రామ సమీపంలోని రాతి గుట్టపై ప్రకృతి ఒడి మధ్యలో కొలువుదీరిన ఆది బసవేశ్వర ఆలయం నాలుగు శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది .తరతరాలుగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు . ఆలయం లోని బసవేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. శ్రావణమాసం ప్రతి సోమవారం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో భక్తుల రద్దీ పెరుగుతుంది .

స్థల పురాణం ఇదీ ..

ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉన్నది. సుమారు 400 ఏళ్ల క్రితం బిచ్కుంద మఠాధిపతి మడిమాలప్ప స్వామికి బీదర్ ప్రాంతంలో ఓ కోడెదూడను కానుకగా ఇచ్చినట్లు చెబుతారు .దానిని బిచ్కుందకు తీసుకెళ్తుండగా బోర్లం రాతి గుట్ట వైపు వెళ్లినట్లు స్థానికుల కథనం. అక్కడ జొన్న పంటను మేయడంతో కాపర్లు దానిని తరిమారు. గుట్ట సమీపానికి చేరుకున్న కోడె పెద్దగా రంకె వేసి అదృశ్యమైనట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ విషయం మడిమాలప్ప స్వామికి తెలియడంతో స్వామి కలలో కనిపించి గుట్టపై శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించినట్లు భక్తుల విశ్వాసం. దీనితో ఆయన బిచ్కుంద నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి గుట్టపై ప్రతిష్టించి పూజలు ప్రారంభించినట్లు చెబుతారు .ప్రస్తుతం ఆలయం బిచ్కుంద బండాయప్ప మఠం ఆధ్వర్యంలో పీఠాధిపతి సోమాయప్ప పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రతినిత్యం అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ఉండగా శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు, ప్రతి సోమవారం అఘోర పశుపతి హోమం, రుద్రాభిషేకాలు, మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది .

బావినీటికి ప్రత్యేకత..

 ఆలయ గుట్ట కింద ఉన్న బావినీటికి కూడా ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతారు . నీరు పాలవలే తెల్లగా, మధురంగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నది.  బిచ్కుంద బండయప్ప  స్వామి జీవించి ఉన్న సమయంలో శ్రావణ మాసంలో ఇక్కడ ఏటా అన్నదానం నిర్వహించేవారు.  ఓసారి నైవేద్యం కోసం పోలెలు తయారు చేస్తుండగా నెయ్యి తక్కువ కావడంతో ఆయన ఆదేశాల మేరకు శిష్యుడు బావి నుంచి నెయ్యి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. చారిత్రక నేపథ్యం, స్థల పురాణం, ప్రకృతి అందాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ క్షేత్రానికి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది .ఆలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి క్షేత్ర చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం ,పాలకులు అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఆది బసవేశ్వర ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

పెరుగుతున్న బసవేశ్వరుడు 

గత 35 ఏళ్లుగా ఆలయంలో పూజారిగా సేవలందిస్తున్న ఆలయ పూజారి శ్రీధర్ అప్ప గారు ఇలా అంటున్నారు. సాధారణంగా శివాలయాలలో గర్భగుడిలో శివలింగం గర్భగుడి బయట నందీశ్వరుడు ఉంటాడు. కానీ ఆది బసవేశ్వర ఆలయంలో గర్భగుడిలో శివలింగంతోనే నందీశ్వరుడు ఉండడం విశేషం .భక్తులు నమ్మకంతో కొలిచే బసవేశ్వరుడు ప్రతి ఏటా పెరుగుతూ కనిపించడం ఇక్కడే ప్రత్యేకత. 

ఆది బసవేశ్వర ఆలయం మా గ్రామంలో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ప్రతి సోమవారం చిన్ననాటి నుండి బసవేశ్వరుని దర్శించుకుంటాను అని గ్రామస్తులు కేశెట్టి రఘునాథ్ గుప్తా గారు అన్నారు.

ఆధ్యాత్మిక సమాచారం 7-9-2026

 దుర్గా మాత షెడ్డు నిర్మాణానికి భూమి పూజ



నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో దుర్గామాత షెడ్డు నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ మనేద శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు .తన సొంత నిధులైన లక్ష రూపాయల వ్యయంతో శ్రీనివాస్ సంబంధిత షెడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


ఆలయ అభివృద్ధికి మొదటి వేతనం విరాళం 



నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల రుచిత తన మొదటి వేతనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల కోసం విరాళంగా అందించారు. వేతనానికి సంబంధించిన చెక్కును ఆదివారం వేములవాడ ఆలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పెరిక శ్రీనివాస్ కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏఈఓ లక్ష్మణరావు ఆమె తల్లిదండ్రులు జే రవీందర్ ,మీనా తదితరులు పాల్గొన్నారు.


రూ. 50 లక్షల విలువైన భూమి విరాళం.. 



హన్మకొండ జిల్లా ధర్మ సాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ,రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన చింతలపాటి సుధీర్ రెడ్డి, చింతల పాటి సుకన్య దంపతులు రూ 50 లక్షల విలువైన 550 గజాల ఖాళీ స్థలాన్ని విరాళం గా అందచేశారు. తమ ఓపెన్ ప్లాట్ ను గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ కు అప్పగించారు. తమ తండ్రి చింతలపాటి రామచంద్రా రెడ్డి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందచేసినట్లు తెలిపారు. దాతలను గ్రామస్తులు అభినందించారు. 

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన..



బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ , సేవాలాల్ ఆలయంలో ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగదాంబ, సేవాలాల్ ఆలయాల నిర్మాణం తో తండాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తండా వాసులు, భక్తులు పాల్గొన్నారు. 

తెలంగాణ గంగ తెప్పోత్సవం అంటే..



తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనుల పండుగ గా జరిగింది .ఖైరతాబాద్ ఏడు గుడులనుంచి హుస్సేన్ సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతురాజులు, జోగినిల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభా యాత్ర సాగింది. నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని గంగపుత్రులకు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా గంగ తెప్పోత్సవ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు మాట్లాడుతూ గంగ తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు .



హఫీజ్ పేటలో అహింసా స్థూపం..



దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో మియాపూర్ లో "అహింసా స్తూపం " ఆవిష్కృతమైంది. ఆదివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డులో అహింస స్తూపంను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రవికుమార్ యాదవులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. స్థూపం రాబోయే తరాలకు శాంతి ,అహింసల దివ్య సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్తంభంపై లిఖించిన" పరస్పరోపగ్రహో జీవానాం  " అనే సందేశం నేటి అశాంతియుత  ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మనిషి మనిషికి , జీవి జీవికి పరస్పరం సహకరించుకోవాలనే ఈ సందేశం సమాజాన్ని ఐక్యంగా నిలబెడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యానికి జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని, ఇది ప్రపంచానికి ఐక్యత మానవీయ సందేశాన్ని చాటి చెప్పిందని అభినందించారు. అహింస అంటే కేవలం శారీరక హాని చేయకపోవడమే కాదు మాటలలో, ప్రవర్తనలో, ఆలోచనలో కూడా దానిని పాటించడమేనని స్పష్టం చేశారు. నగర ఆర్థిక ,సామాజిక ,సంస్కృతిక ప్రగతిలో జైన్, బ్రాహ్మణ ,మహేశ్వరి వంటి వివిధ సమాజాలు కీలక భూమిక పోషించాయని కొనియాడారు.



చుక్క పూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి విరాళాలు


 

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చింతల శ్రీనివాస్ ,అరుంధతి దంపతులు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీనివాసచార్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.

విరాళం అందజేత..



గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామచంద్రస్వామి ఆలయానికి పోతంగల్ కలాన్ కి చెందిన కిషన్ 25 వేల రూపాయల నగదును ఆదివారం సర్పంచ్ గంగారం, ఆలయ కమిటీ చైర్మన్ బిషన్ నాయక్ లకు అందజేశారు.


ధాన్యోస్మి..



సహజ సిద్ధంగా లభించే బంకమట్టి ,ధాన్యం, పెసర్లు, మినుములు, ఆవాలు వంటి పప్పు దినుసులతో తయారు చేసిన వినాయక విగ్రహం ఇది .బొజ్జ గణపయ్యను పూజించడమే కాదు ,ప్రకృతిని సైతం కాపాడుకోవాలి అనే ముఖ్య సందేశంతో విజయవాడకు చెందిన ఒక వైద్యుడు మట్టి ,చిరుధాన్యాలతో నాలుగడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. మట్టి సులువుగా నీటిలో కలిసిపోతుందని, చిరుధాన్యాలు జీవరాశుల ఆహారంగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ఆలయానికి స్టాండు వితరణ..



కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి మైలారం గ్రామానికి చెందిన బొట్టే కల్పన జ్ఞాపకార్థం బొట్టేమోహన్ ఆలయ కమిటీ సభ్యులకు కొబ్బరికాయలు కొట్టే స్టాండును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, గ్రామస్తులు రమేష్, లింగం గౌడ్, గంగాధర్, కాశీరాం, రాములు , మహేందర్ ,రాజు పాల్గొన్నారు.



6, సెప్టెంబర్ 2026, ఆదివారం

అశ్శరభ శరభ అంటే..

 తిరిపెము లెత్తనేల గుణధీరు గజాస్యుని పెండ్లి చేయకన్ 

దొరయక నుంచనేల బలుధూమ్రతనూ జుని వస్త్రహీనుగా

మరియును జేయనేల సుకుమార కుమారుని కుగ్గు బెట్టకన్ 

జరుపుట యేల నిన్ను గన జాలరు నిర్జర మౌని సంగముల్ 

దొరకదు నీ మహా మహిమ దోచదయా శరభాంక లింగమా


పై పద్యం పాలకుర్తి సోమ నాధుడి సమ కాలికుడైన శరభాంకుడు రచించిన ' శరభాంక లింగమా ' అనే శతకం లోనిది. 12-13 వ శతాబ్దానికి చెందిన ఈ కవి ఓరుగల్లు ప్రాంతానికి చెందిన వారు. శరభాంకుడు తన పేరులోని శరభాంకను తను ఆరాధించే శివునికి అన్వయించి ఆత్మీయంగా శరభాంక లింగమా అని సంబోధించుకున్నాడు. నరసింహ స్వామి ఉగ్రతను శాంతింప చేయడానికి శివుడు ఎత్తిన అవతారమే శరభేశ్వరుడు. ( పక్షి, మృగం, మానవ రూపాల సమ్మేళనం ). వీర శైవ ప్రతీకగా దీనిని కొందరు భావిస్తారు. అంత ప్రాచీన కాలంలో నే చిత్తశుద్ధి లేని పూజలను , మంత్ర తంత్రాలను, మూఢ నమ్మకాలను నిరసించిన కవిగా శరభాంకుడు మనకు కనిపిస్తాడు. శరభాంక లింగమా దేవతలు , మునులు కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేవు. నీ గొప్ప మహిమ ఎవరికీ దొరకదు. తోచదు. నీ లీలలు ఎంత విచిత్రమైనవో కదా. 

తిరిపెము ( భిక్షాటన ) ఎత్తడం ఎందుకు, నీ పెద్ద కుమారుడైన , సకల గుణవంతుడు , ధీరుడైన వినాయకునికి పెండ్లి చేయకుండా ఎందుకు ఉన్నావు. నీ రెండో కుమారుడైన కుమార స్వామి కి ( ధూమ్ర తనూజుడు ) దుస్తులు కూడా లేకుండా దిగంబరుడిగా ఎందుకు ఉంచావు. అలాగే ఆ సుకుమారుడైన చిన్న కుమారుడికి కనీసం ఉగ్గు కూడా పోయకుండా అలా కాలం ఎలా వెల్లదీస్తున్నావు. సాక్షాత్తూ మూడు లోకాలకు అధిపతివి ఐన నీవు నీ పిల్లల విషయంలో ఎందుకీ విచిత్రమైన లీలలు ప్రదర్శిస్తున్నావో . నీ అపారమైన మహిమ ఎలాంటిదో ఆ దేవతలకు, గొప్ప మునులకు కూడా అర్థం కావడం లేదు. అంటూ వ్యాజ స్తుతిలో శంకరుణ్ణి స్తుతిస్తున్నాడు. 

సంసార రహితుడైన ఈశ్వరుని తాత్వికత తెలియ చేయడం కవి ఉద్దేశ్యం కావచ్చు. జననానంతరం కుమార స్వామి కి పాలు పట్టింది కృత్తికలు కాబట్టి శంకరుణ్ణి ఇలా నిందించ వచ్చు. అలాగే అన్న వినాయకుడితో జ్ఞాన పోటీలో ఓడిపోయిన అనంతరం కుమార స్వామి , వస్త్రాభరణాలు వదిలేసి కౌపీనం ధరించి జ్ఞాన వైరాగ్య మూర్తిగా పళని కొండ పై వెలిశాడన్న పురాణ కథ ను ఈ సందర్భంగా కవి ప్రస్తావించి ఉండవచ్చు. 

శ్రీల ప్రభు పాదుల దివ్య ఆవిర్భావ దినోత్సవం

 అంతర్జాతీయ హరికృష్ణ ఉద్యమం ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు విశ్వ గురువు స్త్రీల ప్రభుపాదుల దివ్య ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హరే కష్ణ గోల్డెన్ టెంపుల్ లో నందోత్సవం 130 వ వ్యాస పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ ' వ్యాస పూజ 2026 ' ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీల ప్రభుపాద సందేశ విశిష్టతను ఆధునిక కాలంలో శ్రీకృష్ణుని లీలలను స్మరించుకోవాలిసిన ఆవశ్యకతను తెలియజేశారు స్త్రీల ప్రభుపాదుల వారి జీవితం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఏ విధంగా ప్రేరణగా నిలుస్తోంది అనే విషయాన్ని ఆయన వివరించారు



ఏ దేవతా మూర్తులకు ఎలా ప్రదక్షిణం..

 ఏకం గణాధిపం కుర్యాత్ ద్వా సూర్యే 

త్రీని శంకరే చత్వారి కేశవం దేవే 

సప్త శ్వత్తే ప్రదక్షిణం..

అని పాంచ రాత్ర ఆగమం లోని పుష్కర సంహిత తెలియ జేయడం జరిగింది.గణపతికి ఒక సారి , సూర్య భగవానుడికి రెండు సార్లు,పరమేశ్వరుడికి మూడు సార్లు , శ్రీ మహా విష్ణువుకు నాలుగు సార్లు , అశ్వద్ధ వృక్షానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలన్నది ఈ శ్లోకం యొక్క భావం.


శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం మహత్యం..

ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం .. అని ఆరంభమయ్యే శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం ఎంతో ప్రభావ వంతమైనది. ప్రతి రోజూ 10 నిమిషాలు శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం భక్తి శ్రద్ధలతో పఠనం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.ఫలితంగా ఇంట్లో అన్ని అరిష్టాలు తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమస్త దుఃఖాలకూ కారణమైన అజ్ఞానాన్ని రూపు మాపే మూర్తి శ్రీ దక్షిణా మూర్తి.జ్ఞానానికి ప్రతీక అయిన ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రం శ్రీ కాళహస్తి. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ . మోక్షార్థుల అభీష్టాన్ని నెరవేర్చే పరమాత్మ కూడా దక్షిణా మూర్తి యే..

శ్లోకామృతం..

ఆపత్సు మిత్రం జానీయాత్ యుద్ధే శూరం రుణే శుచిం 

భార్యాం క్షీణేషు విత్తేషు వ్యసనేషు చ బాంధవాన్..

ఈ సందేశాత్మక శ్లోకం నారాయణ పండితుడు రచించిన " హితోపదేశం " గ్రంథంలోనిది.ఆపదలో ఉన్నప్పుడు మిత్రుల గుణం, యుద్ధ రంగంలో శూరుల లక్షణం , అప్పు ఇచ్చినప్పుడు ఎదుటి వారి నిజాయితీ , ధనం కోల్పోయి పేదరికం అనుభవిస్తున్నప్పుడు భార్య ప్రేమ గురించి ,అపాయం వాటిల్లినప్పుడు ఎవరు నిజమైన బంధువులో గుర్తించ వచ్చు అన్నది ఈ శ్లోకానికి అర్థం.

అంతా సవ్యంగా ఉన్నపుడు అందరూ దగ్గర చేరుతారు.ఆత్మీయంగా మాట్లాడుతారు. కానీ సమస్యలు చుట్టు ముట్టినప్పుడు , దుఃఖంతో బాధ పడుతున్నప్పుడు .. వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రభావం తమ మీద పడుతుందేమో , తాము అందులో చిక్కు కుంటామేమో.. అని వెరచి దురమౌతుంటారు.అందుకే కష్ట సమయంలో ఆసరా అందించే వారే అసలైన ఆత్మీయులని ఈ శ్లోకం చాటుతుంది.

గోపీ చందనం అంటే

 అవతార పురుషుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్ముడు సంచరించిన ప్రాంతాలనుండి స్వీకరించిన మట్టి ని" గోపీ చందనం" అంటారు. అది కృష్ణుడి పాద స్పర్శ తో పవిత్రమైన లేత పసుపు రంగులో ఉన్న మన్ను. బృందావనం, ద్వారక తదితర క్షేత్రాలలో ఈ చందనం లభ్యమవుతుంది. బృందావనం మట్టి, పూరీ జగన్నాథుని ప్రసాదం పరమ పవిత్రం అనే వారు రామకృష్ణ పరమ హంస. 

అంతే కాదు, ఆ రెండింటిని ఎప్పుడూ తన వద్ద ఉంచుకునే వారు ఆయన. ఈ మన్ను ధారణ యోగ్యం అని చెబుతారు.అందుకే దీన్ని " ఊర్ధ్వ పుండ్రంగా" ( వైష్ణవుల నుదుట నిలువు నామాలు ) ధరించడం ఆనవాయితీ. పుణ్య తీర్థాలలో ,తులసి మొక్క మూలం లోని మట్టి కూడా ధారణ యోగ్యమని మహర్షులు పేర్కొన్నారు.

5, సెప్టెంబర్ 2026, శనివారం

చదువుల తల్లి కి అక్షరమాల పట్టు చీర

 సిరిసిల్ల జిల్లా కు చెందిన చేనేత కార్మికుడు సల్ల జగదీశ్ అకుంఠిత దీక్ష తో బాసరలోని చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అమ్మవారికి మగ్గం మీద 56 తెలుగు అక్షరమాల తో నేసిన పట్టు చీరను శుక్రవారం నాడు బాసర పుణ్య క్షేత్రం లోని బాలాలయంలో ఆలయ అధికారులు, పూజారుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ సమర్పించారు. అంతకు ముందు అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఈ ప్రత్యేక పట్టు చీరను సల్ల జగదీశ్, సంఘం సభ్యులు బాజా భజంత్రీలతో అమ్మ వారి బాలాలయానికి తీసుకు వచ్చారు. 

ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి , వేద పండితులు,అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్ ను ఆలయ ఈవో అంజనీ దేవి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ , పద్మశాలి సంఘం సభ్యులు రాపోలు సుధాకర్, కే.గంగాధర్,స్వామి, అశోక్, రమేశ్, రాజు, పోశెట్టి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.



4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జగన్నాధునికి 60,821 ఎకరాలు

 పూరీ లోని ప్రసిద్ధి చెందిన జగన్నాధ ఆలయం ఆస్తులను శ్రీ జగన్నాధ ఆలయ పరిపాలన ప్రకటించింది. పలు బ్యాంకులలో మొత్తం రూ. 1912 కోట్ల రూపాయలు ఉండగా , ఆలయం పేరు మీద పలు రాష్ట్రాలలో 60,821 ఎకరాల భూమి ఉందని తెలిపారు. వీటికి రత్న భండారు లో నిక్షిప్తం చేసిన బంగారు, డైమండ్ ఆభరణాలు అదనం. 

భక్తులు ఇచ్చే డొనేషన్లు , గుడికి ఉన్న స్వంత క్వారీలు , ఫిక్స్డ్ డిపాజిట్ల పై వచ్చే వడ్డీలు, భూ క్రయ విక్రయాల వల్ల సమకూరే సొమ్ములు ,ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల ద్వారా ఈ డబ్బులు సమకూరినట్లు ఎస్ జే టీ ఏ ముఖ్య నిర్వాహకుడు అరబింద కుమార్ పాధి ఓ ప్రకటనలో తెలిపారు.

సమర్పణ్ పేరుతో డిజిటల్ డొనేషన్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించామని , ఆగస్టు 31 నాటికి దాని వల్ల రూ 56.71 లక్షల వరకు వచ్చాయని తెలిపారు. ఆలయం పేరు మీద ఉన్న భూమిలో 60,426 ఎకరాలు రాష్ట్రంలోని 24 జిల్లా లలో విస్తరించి ఉండగా , మిగిలిన 395 ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ తో సహా ఆరు రాష్ట్రాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

పవిత్ర భండారా ఉత్సవం@ఆగ్రా..

 రాధా స్వామి మత ప్రవర్తకులు , మొదటి సంత్ సద్గురువు అయిన పరమ పురుష్ పూరన్ ధనీ హుజూర్ స్వామి మహారాజ్ జయంతి సందర్భంగా పవిత్ర భండారా ఉత్సవం శుక్ర వారం జన్మాష్టమి రోజున దయాళ్ బాగ్, ఆగ్రా లో నిర్వహించనున్నారు. 

హుజూర్ స్వామి మహారాజ్ 1818 ఆగస్టు 24 -25 మధ్య పవిత్ర జన్మాష్టమి రాత్రి ఆగ్రాలోని పన్నీ గలీలో సేట్ శివ్ దయాళ్ సింగ్ గా అవతరించారు. ఆయన జీవుల ఉద్ధరణ కు నిజ్ ఘర్ ప్రాప్తికి ప్రత్యక్ష మార్గమైన సూరత్ శబ్ద యోగాన్ని ప్రకాశింప చేసి , 1861, ఫిబ్రవరి 15, వసంత పంచమి రోజున సర్వ సాధారణ సత్సంగీయులకు రాధాస్వామి సత్సంగ ద్వారాలను తెరిచారు. భండారా వారం సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరుపబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తూర్పు రాష్ట్రాలు, యూరప్ నుంచి అనేక మంది భక్తులు దయాళ్ బాగ్ కు విచ్చేయనున్నారు. శుక్రవారం ఉదయం పవిత్ర హారతి, రెండవ సెషన్ లో పొలాల్లో పవిత్ర భండారా నిర్వహించ బడుతుంది. స్వామీజీ మహారాజ్ బోధనలపై విశిష్ట సమ్మేళనాన్ని దయాళ్ బాగ్ ప్రస్తుతం జరుపుతోంది. 

2, సెప్టెంబర్ 2026, బుధవారం

తమిళనాడు ఆలయాల్లో.. నో మొబైల్స్

 తమిళనాడు లోని ప్రముఖ ఆలయాల్లో సెల్ ఫోన్లు తీసుకు రావడం పై హిందూ మత, దేవాదాయ శాఖ నిషేధం విధించింది . ఆలయాలలో యువత నిబంధనలను ఉల్లంఘిస్తూ రీల్స్, ఫోటోలు తీయడం గమనించిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల మొబైల్ ఫోన్లను భద్ర పరచడానికి ఆలయ ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఒక్కో ఫోన్ కు రూ 5 చొప్పున వసూలు చేస్తున్నారు.  కాంచీ పురంలోని దేవరాజ స్వామి ఆలయంలో ఈ విధానం ఉదయం నుండే ప్రారంభం అయింది. ఫోన్ మోడల్, నంబర్ రిజిస్టర్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నారు. ఇది ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొబైల్ బ్యాన్ బోర్డులను ఎంట్రెన్స్ వద్దే ఏర్పాటు చేయాలని , పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా భక్తులకు తెలియ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

తిరుపతిలో శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు..

 తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి ఈ ఉత్సవాల్లో భాగంగా 19 న అత్యంత విశేషమైన గరుడ సేవ ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది నెలల క్రితం తిరుమల లో అందుబాటులోకి వచ్చిన వసతి సముదాయం 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమల లో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు , 5 పీ ఏ సీ లు ఉన్నాయి. అయినా భక్తులు గదుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుపతి లో కొత్త వసతి సముదాయాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతి లో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. 

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న ఈ సముదాయాల పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా , లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మించారు.దాదాపుగా 10 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించే వెసులుబాటు కలగ నున్నదని ఆలయ వర్గాల అంచనా.

రెండో అంతస్తులో రిసెప్షన్ , అన్న దానం , వసతి కేంద్రాలుంటాయి. మూడు,నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు..సుమారు 7 వేల మంది భక్తులకు సరిపడా  లాకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 మార్చి నెలలో ప్రారంభమైన వీటి నిర్మాణానికి రూ 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

ఈ గదులను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పొందేలా భక్తులకు వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.

అలంపూర్ ఆలయంలో.. సౌండ్ అండ్ లైట్స్ షో

 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలంపూర్ క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక , సాంస్కృతిక వైభవాన్ని వెలుగు జిలుగుల, ధ్వనుల సమ్మేళనంతో ఆవిష్కరించే మల్టీ మీడియా , సౌండ్, లైట్ షో ను 4.60 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ షోను ఆలంపూర్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం  మల్టీ మీడియా, సౌండ్, లైట్ షో ను ప్రతినిధులు, ప్రజలతో కలిపి తిలకించారు. 

ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు ఆలంపూర్ ఆలయ విశిష్టతపై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 




శక్కర్ బేస్ ఆంజనేయ ఆలయం,మద్నూర్

 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల పురాతన శక్కర్ బేస్ ఆంజనేయ స్వామి ఆలయం లో శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆవరణలో ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం పైన శిఖర ప్రతిష్ఠాపన , ఆలయంలో నంది, శివ లింగం , ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బిచ్ కుంద మండలం ఖత్ గావ్ మల్లిఖార్జున స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 




సేవాలాల్ ఆలయ నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఆస్పత్రి వైద్యులు డా శ్రీనివాస్ నాయక్ 5500 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాత ను ఘనంగా సన్మానించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.