14, సెప్టెంబర్ 2026, సోమవారం

ముంబై గణేశుడికి 703 కోట్ల బీమా

 


ముంబైలోని కింగ్స్ సర్కిల్ లో జీ ఎస్ బీ ( గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం , 335 కిలోల వెండి , రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ. 703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శని వారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్నారు. జీ ఎస్ బీ వినాయక చవితి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా నిలుస్తున్నాయి . కేవలం ఆభరణాలే కాకుండా .. నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నవరాత్రులు ఇక్కడ వేద సాంప్రదాయాలు , ఆచారాలు , భజనలు , కీర్తనలతో పాటు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. 

పుచ్చకాయపై గణేశుడు..

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితి సందర్భంగా ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు ,4 అంగుళాల పొడవు గల వినాయకుడి రూపం చెక్కారు.గతంలో చింత గింజలపై వినాయకుడు ,బియ్యపు గింజపై వినాయకుడి చిత్రం వేశారు.ఇలా ఎన్నో సూక్ష్మ కళా రూపాలు తయారు చేసి జాతీయ అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకోవడం జరిగింది.

డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్.. తిరుమల

 


క్యూలైన్లలో వైకుంఠ వైభవం.. భక్తులకు డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్.. 



తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృధా పోనీయకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు టీటీడీ వినూత్న అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ తదితర ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానంతో వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ వన్ లో నాలుగు కోట్ల రూపాయలతో డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్/ హీలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. 

తిరుమలేశుడి ఆలయ ప్రాకారాలు మిలమిల..



తిరుమలేశుడి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులను పుణె కు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రెలీజియస్ ట్రస్ట్ ముందుకొచ్చి చేయిస్తోంది. మొదటి దశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల్లోని పై కప్పులు , స్తంభాలకు సంబంధించిన పనులను నిపుణులైన కార్మికులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మైసూరు పురావస్తు శాఖ విశ్రాంత కెమిస్ట్ అంబేద్కర్ పర్యవేక్షణలో ఈ పనులు చేస్తున్నారు. 

టీటీడీ కి కోటి రూపాయల విరాళం..

టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బెంగళూరుకు చెందిన గిరియప్ప దయానంద రూ. 50 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు కు 50 లక్షలు విరాళంగా అందించారు. 


శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం..

తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే నిమిత్తం టీటీడీ కి రిలయన్స్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది.రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మ రథం బస్సుల్లో తొలి విడత కింద 15 ఈ బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి.మిగిలిన 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ తెలిపింది.