5, సెప్టెంబర్ 2026, శనివారం

చదువుల తల్లి కి అక్షరమాల పట్టు చీర

 సిరిసిల్ల జిల్లా కు చెందిన చేనేత కార్మికుడు సల్ల జగదీశ్ అకుంఠిత దీక్ష తో బాసరలోని చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అమ్మవారికి మగ్గం మీద 56 తెలుగు అక్షరమాల తో నేసిన పట్టు చీరను శుక్రవారం నాడు బాసర పుణ్య క్షేత్రం లోని బాలాలయంలో ఆలయ అధికారులు, పూజారుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ సమర్పించారు. అంతకు ముందు అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఈ ప్రత్యేక పట్టు చీరను సల్ల జగదీశ్, సంఘం సభ్యులు బాజా భజంత్రీలతో అమ్మ వారి బాలాలయానికి తీసుకు వచ్చారు. 

ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి , వేద పండితులు,అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్ ను ఆలయ ఈవో అంజనీ దేవి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ , పద్మశాలి సంఘం సభ్యులు రాపోలు సుధాకర్, కే.గంగాధర్,స్వామి, అశోక్, రమేశ్, రాజు, పోశెట్టి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.



4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జగన్నాధునికి 60,821 ఎకరాలు

 పూరీ లోని ప్రసిద్ధి చెందిన జగన్నాధ ఆలయం ఆస్తులను శ్రీ జగన్నాధ ఆలయ పరిపాలన ప్రకటించింది. పలు బ్యాంకులలో మొత్తం రూ. 1912 కోట్ల రూపాయలు ఉండగా , ఆలయం పేరు మీద పలు రాష్ట్రాలలో 60,821 ఎకరాల భూమి ఉందని తెలిపారు. వీటికి రత్న భండారు లో నిక్షిప్తం చేసిన బంగారు, డైమండ్ ఆభరణాలు అదనం. 

భక్తులు ఇచ్చే డొనేషన్లు , గుడికి ఉన్న స్వంత క్వారీలు , ఫిక్స్డ్ డిపాజిట్ల పై వచ్చే వడ్డీలు, భూ క్రయ విక్రయాల వల్ల సమకూరే సొమ్ములు ,ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల ద్వారా ఈ డబ్బులు సమకూరినట్లు ఎస్ జే టీ ఏ ముఖ్య నిర్వాహకుడు అరబింద కుమార్ పాధి ఓ ప్రకటనలో తెలిపారు.

సమర్పణ్ పేరుతో డిజిటల్ డొనేషన్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించామని , ఆగస్టు 31 నాటికి దాని వల్ల రూ 56.71 లక్షల వరకు వచ్చాయని తెలిపారు. ఆలయం పేరు మీద ఉన్న భూమిలో 60,426 ఎకరాలు రాష్ట్రంలోని 24 జిల్లా లలో విస్తరించి ఉండగా , మిగిలిన 395 ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ తో సహా ఆరు రాష్ట్రాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.