6, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఏ దేవతా మూర్తులకు ఎలా ప్రదక్షిణం..

 ఏకం గణాధిపం కుర్యాత్ ద్వా సూర్యే 

త్రీని శంకరే చత్వారి కేశవం దేవే 

సప్త శ్వత్తే ప్రదక్షిణం..

అని పాంచ రాత్ర ఆగమం లోని పుష్కర సంహిత తెలియ జేయడం జరిగింది.గణపతికి ఒక సారి , సూర్య భగవానుడికి రెండు సార్లు,పరమేశ్వరుడికి మూడు సార్లు , శ్రీ మహా విష్ణువుకు నాలుగు సార్లు , అశ్వద్ధ వృక్షానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలన్నది ఈ శ్లోకం యొక్క భావం.


శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం మహత్యం..

ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం .. అని ఆరంభమయ్యే శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం ఎంతో ప్రభావ వంతమైనది. ప్రతి రోజూ 10 నిమిషాలు శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం భక్తి శ్రద్ధలతో పఠనం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.ఫలితంగా ఇంట్లో అన్ని అరిష్టాలు తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమస్త దుఃఖాలకూ కారణమైన అజ్ఞానాన్ని రూపు మాపే మూర్తి శ్రీ దక్షిణా మూర్తి.జ్ఞానానికి ప్రతీక అయిన ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రం శ్రీ కాళహస్తి. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ . మోక్షార్థుల అభీష్టాన్ని నెరవేర్చే పరమాత్మ కూడా దక్షిణా మూర్తి యే..

శ్లోకామృతం..

ఆపత్సు మిత్రం జానీయాత్ యుద్ధే శూరం రుణే శుచిం 

భార్యాం క్షీణేషు విత్తేషు వ్యసనేషు చ బాంధవాన్..

ఈ సందేశాత్మక శ్లోకం నారాయణ పండితుడు రచించిన " హితోపదేశం " గ్రంథంలోనిది.ఆపదలో ఉన్నప్పుడు మిత్రుల గుణం, యుద్ధ రంగంలో శూరుల లక్షణం , అప్పు ఇచ్చినప్పుడు ఎదుటి వారి నిజాయితీ , ధనం కోల్పోయి పేదరికం అనుభవిస్తున్నప్పుడు భార్య ప్రేమ గురించి ,అపాయం వాటిల్లినప్పుడు ఎవరు నిజమైన బంధువులో గుర్తించ వచ్చు అన్నది ఈ శ్లోకానికి అర్థం.

అంతా సవ్యంగా ఉన్నపుడు అందరూ దగ్గర చేరుతారు.ఆత్మీయంగా మాట్లాడుతారు. కానీ సమస్యలు చుట్టు ముట్టినప్పుడు , దుఃఖంతో బాధ పడుతున్నప్పుడు .. వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రభావం తమ మీద పడుతుందేమో , తాము అందులో చిక్కు కుంటామేమో.. అని వెరచి దురమౌతుంటారు.అందుకే కష్ట సమయంలో ఆసరా అందించే వారే అసలైన ఆత్మీయులని ఈ శ్లోకం చాటుతుంది.

గోపీ చందనం అంటే

 అవతార పురుషుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్ముడు సంచరించిన ప్రాంతాలనుండి స్వీకరించిన మట్టి ని" గోపీ చందనం" అంటారు. అది కృష్ణుడి పాద స్పర్శ తో పవిత్రమైన లేత పసుపు రంగులో ఉన్న మన్ను. బృందావనం, ద్వారక తదితర క్షేత్రాలలో ఈ చందనం లభ్యమవుతుంది. బృందావనం మట్టి, పూరీ జగన్నాథుని ప్రసాదం పరమ పవిత్రం అనే వారు రామకృష్ణ పరమ హంస. 

అంతే కాదు, ఆ రెండింటిని ఎప్పుడూ తన వద్ద ఉంచుకునే వారు ఆయన. ఈ మన్ను ధారణ యోగ్యం అని చెబుతారు.అందుకే దీన్ని " ఊర్ధ్వ పుండ్రంగా" ( వైష్ణవుల నుదుట నిలువు నామాలు ) ధరించడం ఆనవాయితీ. పుణ్య తీర్థాలలో ,తులసి మొక్క మూలం లోని మట్టి కూడా ధారణ యోగ్యమని మహర్షులు పేర్కొన్నారు.