సిరిసిల్ల జిల్లా కు చెందిన చేనేత కార్మికుడు సల్ల జగదీశ్ అకుంఠిత దీక్ష తో బాసరలోని చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అమ్మవారికి మగ్గం మీద 56 తెలుగు అక్షరమాల తో నేసిన పట్టు చీరను శుక్రవారం నాడు బాసర పుణ్య క్షేత్రం లోని బాలాలయంలో ఆలయ అధికారులు, పూజారుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ సమర్పించారు. అంతకు ముందు అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఈ ప్రత్యేక పట్టు చీరను సల్ల జగదీశ్, సంఘం సభ్యులు బాజా భజంత్రీలతో అమ్మ వారి బాలాలయానికి తీసుకు వచ్చారు.
ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి , వేద పండితులు,అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్ ను ఆలయ ఈవో అంజనీ దేవి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ , పద్మశాలి సంఘం సభ్యులు రాపోలు సుధాకర్, కే.గంగాధర్,స్వామి, అశోక్, రమేశ్, రాజు, పోశెట్టి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
