
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ,శివ తత్వాన్ని బోధించిన తత్వానంద స్వామి/ వేలేటి రామచంద్ర రావు గారు ఆదివారం శివ సాయుజ్యం పొందారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి మల్లాయ పల్లికి చెందిన వేలేటి రామచంద్రారావు ప్రారంభంలో మల్లాయపల్లిలో బుక్ బైండింగ్ ,ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్ గా, చిన్న మల్లారెడ్డిపేటలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. జ్యోతిష్య శాస్త్రం రంగంలోనూ రామచంద్ర రావుకు విశేష గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక పరిణామాలను ఆయన ముందుగానే అంచనా వేశారని సన్నిహితులు చెబుతుంటారు .పలు పత్రికలలో పాత్రికేయుడుగా పని చేసిన ఆయన కొంతకాలం సినీ రంగంలోనూ పనిచేశారు. వివిధ రంగాలలో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఆయన వాన ప్రస్తాశ్రమ దీక్ష స్వీకరించారు. బసవ కళ్యాణ ఆశ్రమానికి చెందిన స్వామి మధనానందా స్వామి వద్ద ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందిన ఆయన తత్వానంద స్వామిగా దీక్ష స్వీకరించారు. భౌతిక అనుభవాలను ఆధ్యాత్మిక చింతనతో మేళవిస్తూ ప్రజలకు అద్భుతమైన సందేశాలు అందించారు. తెలుగు భాషలో సందేశ తరంగిణి ,భారత యువజనులారా, జగము తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. హైదరాబాదులోని హన్మోజీ గూడలో గాయత్రీ మాత ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ,ధార్మిక కార్యక్రమాలు ,గాయత్రి ఉపాసన ప్రచారంలో చురుగ్గా పాల్గొని అనేకమంది శిష్యులను సంపాదించుకున్నారు. జీవితపు తొలినాళ్లలో మనుషుల జాతకాలను పరిశీలించిన ఆయన మలిదశలో మనిషి అంతరంగాన్ని తట్టి లేపే తత్వవేత్తగా మారారు. ఆయన పార్థివ దేహానికి ఆదివారం హన్మోజీ గూడలోని అంతిమ సంస్కారాలు నిర్వహించారు.