12, జనవరి 2024, శుక్రవారం

పేదవాడు ఎవరంటే

ఉన్నంతలో తృప్తిగా బతికే వారు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా రాజులైతే రాజ్య విస్తరణ చేసుకుంటూ పోయి  సామ్రాజ్యాధిపతులు కావాలని కోరుకుంటారు . ఈ క్రమంలో లక్షలాది మంది ప్రజలు,సైనికులు యుద్ధంలో మరణించడమో , ఇక్కట్ల పాలు కావడమో జరుగుతుంది.అటువంటి వారికి జ్ఞానోదయం కలిగించిన కథ ఇది.


విక్రమ వర్మ అనే ఒక రాజు ఎప్పుడూ ఏదో ఒక దేశం మీద దాడి చేయడం వారిని లొంగదీసుకోవడం పనిగా పెట్టుకున్నాడు. ఎప్పటి లాగే అతను పొరుగు దేశం మీదికి దండయాత్రకు బయలు దేరినప్పుడు మార్గ మధ్యలో ఉన్న ఒక అడవిలో ఒక మునిని చూడడం జరిగింది.ఎముకలు కొరికే చలిలో కేవలం నడుముకు పంచె మాత్రమే చుట్టుకుని ధ్యానం చేస్తున్నాడు. అయ్యో ఈ ముని చలినేలా తట్టుకుంటాడో అని తన దగ్గరున్న శాలువను కప్పాడు రాజు . దాంతో కళ్ళు తెరిచిన ముని ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు.

స్వామీ నేను ఈ రాజ్యాన్ని పాలించే రాజును , పొరుగు దేశం పైకి దండయాత్రకు బయలు దేరాను. విజయం సాధించడానికి మీ దగ్గర ఆశీస్సుల కోసం మీ చెంత నిలుచున్నాను అన్నాడు రాజు. అంతట ముని.. సరే నాకు కప్పిన ఈ శాలువా తీసుకు పో, నేను ఇప్పటికే ధనవంతుడిని. నాకున్న ఆస్తి తో పాటు ఈ శాలువా భారాన్ని మోయడానికి సిద్ధంగా లేను అన్నాడు. 
అంతట రాజు.. స్వామీ మీరలా అనకండి , మీరు మునులు . మీకన్నీ తెలుసు. నా దగ్గర అనేక శాలువాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేను మీకిచ్చాను. ఇది స్వీకరించడానికి మీరెందుకు తిరస్కరిస్తున్నారు. మీరు అడగ లేదు. నా అంతట నేనే మీకు కప్పాను అన్నాడు రాజు. 
రాజు మాటలన్నీ విన్న ముని.. పుత్రా ఇప్పటికే నీ దగ్గర ఓ దేశం ఉంది. అది చాలదన్నట్లు మరొక దేశం మీదికి యుద్ధానికి పోతున్నావు. అలాగే నీ దగ్గర అనేక శాలువాలు ఉన్నప్పటికీ నీకు మరో శాలువ అవసరం ఉంది. అవసరాలు ఉన్నవాడే పేద వాడు నా దృష్టిలో. అతనికే అనేక వస్తువులు కావాల్సి ఉంటుందన్నాడు. 
ముని మాట రాజుకి చెంప దెబ్బలా అనిపించింది . దాంతో మనసు మార్చుకున్న రాజు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు.