21, జనవరి 2019, సోమవారం

తల్లి దండ్రులను మరువ వద్దు.


మాతృదేవోభవ ,పితృదేవోభవ

1. ఎవరిని మరచినా నీ తల్లిదండ్రులను మాత్రం మరువకు.వాళ్ళను మించి నీ మంచి కోరేవారు ఎవరూ ఉండరని తెలుసుకో.

2. నీవు జన్మించాలని రాళ్ళకు పూజలు చేశారు వారు.రాయివై వారి హృదయాలను ముక్కలు చేయకు.

3. కొసరి కొసరి గోరుముద్దలు పెట్టి అల్లారుముద్దుగా నిన్ను పెంచారు వారు.నీకు అమృతం పంచిన వారిపై విషాన్ని విరజిమ్మకు.

4. ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు.ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు.

5.నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా ?తల్లిదండ్రుల సేవలోనే నిజమైన సంపాదనలున్నాయని గ్రహించు.

6.సంతానం వల్ల సుఖం కోరుతావు.నీ సంతాన ధర్మం మరువవద్దు.ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే సత్యం మరువబోకు.

7.నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడి పొత్తిళ్లలో పడుకోబెట్టారు.అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు.

8.నీవు నడిచే మార్గములో పూలు పరిచారు వారు.అట్టి మార్గదర్శకులకు నీవే కాలులో ముల్లువై బాధించకు.

9. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం సంపాదించలేవు.వారి పాదసేవలోనే గొప్పదనం ఉన్నదని జీవితాంతం మరువవద్దు.

29, డిసెంబర్ 2018, శనివారం

హనుమంతుడికి ఎలా నమస్కరించాలి? / HANUMANTHUDIKI YELA NAMASKARINCHAALI?


ఏ దేవతకైనా అర్చనలో భాగంగా భక్తులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.మహిళలు సాష్టాంగ నమస్కారం చేయరాదని శాస్త్ర నియమం.హనుమంతుడి విషయంలో పురుషులు సాష్టాంగ నమస్కారం చేయకూడదనే నియమం ఏదీ లేదు.అది ఒక విశ్వాసం మాత్రమే.ఆంజనేయుడు అంటే సేవకు ప్రతీక.అనితర సాధ్యమైన ఘనకార్యాలు చేసి కూడారామచంద్రుని పాదసన్నిధిని కోరుకునే సేవా తత్పరుడు.తాను రామదాసుణ్ణని త్రికరణశుద్ధిగా భావించే ఆంజనేయుడు భక్తి అంతా శ్రీరామునికే సమర్పించాలని భావిస్తాడు.ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయరాదనే నమ్మిక లోకంలో ప్రచారమైంది.ఐతే స్వామి త్రిమూర్తి స్వరూపుడనీ ,రుద్రాంశ సంభూతుడనీ సమ్హితలు చెబుతున్నాయి.ఈ దృష్టితో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.కొందరు హనుమ పాదాల కింద శైనైశ్చరుడు ఉంటాడు కాబట్టి సాష్టాంగం చేయకూడదని అనుకుంటారు,అది సరి కాదు.